తరిగోపుల ప్రాంగణానికి మరోసారి Facelift
2014 లో చిల్లలవాగు ఒడ్డున ఉండే శ్మశానం ఎముకలు, క్రుళ్ళిన పశుదేహాల భాగాలు, కోడి బొచ్చు, పనికిరాని ప్లాస్టిక్ వస్తువులు, ప్రాత బట్టలు వగైరాలతో ఎంత దరిద్రంగా ఉండేదో మనందరకూ తెలుసు.
స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు అవన్నీ ఎత్తివేసి, శుభ్రం చేసి, క్రొత్త మట్టి వేసి ఒక అందాల తోటను తయారుచేశారు. ఈ కంపు కొట్టే చెత్తను తీయడం ఎంత జుగుప్సాకరంగా ఉండేదో, అప్పుడెందరు వాంతులు చేసుకున్నారో స్వచ్ఛ కార్యకర్తలకింకా జ్ఞాపకమే! అయినా వాళ్ళు దాన్నొక బాధ్యతగా - యుద్ధం చేసినట్లుగా నెరవేర్చడం గ్రామాభివృద్ధి కోసం వారి పట్టుదలకు నిదర్శనం.
కాలుపెట్టడానికి వీలులేని ఆ ప్రాంతాన్ని చక్కగా తయారుచేసి 2015 నవంబర్ లో స్వచ్ఛ చల్లపల్లి మొదటి వార్షికోత్సవ వేడుక ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆనాటి కేంద్రమంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు సంచరించేట్లుగా చేశారు.
మరికొంత కాలం తర్వాత ఈ శ్మశాన ముఖద్వారాన్ని మరింత ఆహ్లాదంగా ఉండాలని డా.పద్మావతి గారు డిజైన్ మార్పించారు. శ్మశానమనే భావన లేకుండా పంచాయితీ వారు ఆ ప్రదేశానికి “తరిగోపుల ప్రాంగణం” అనే పేరు పెట్టారు.
చిల్లలవాగు ప్రాంతాన్ని మరింత అందంగా చేయాలని డా.పద్మావతి గారి ఆకాంక్ష. MLA శ్రీ మండలి బుద్ధ ప్రసాదు గారు డ్రైనేజి ఆఫీసర్లతోనూ, పంచాయితీ వారితోనూ, R & B ఇంజనీర్లతోనూ చర్చించి అనుమతులు ఇప్పించారు. చిల్లలవాగు వంతెన గోడలు బీటలువారి పడిపోవడానికి సిద్ధంగా ఉంటే దానిని మరలా క్రొత్తగా కట్టించి ఆర్కిటెక్ట్ సహకారంతో పూల మొక్కలు పెట్టడానికి వీలుగా రీడిజైన్ చేయించారు.
వంతెనకు దక్షిణ భాగం రోడ్డు మార్జిన్ నుండీ ఖాళీగా ఉంది. దానికి కాంక్రీట్ రీటైనింగ్ వాల్ కట్టి, కార్యకర్తలు క్రొత్తగా మట్టి పోసి పూల మొక్కలు నాటారు.
తరిగోపుల ప్రాంగణంలోనికి వెళ్ళే దారికి ఉత్తరం వైపు గోడను రివిట్మెంట్ చేసి, రైలింగ్ ఏర్పరిచి, పూల మొక్కలు, లాన్ వేసి మరింత సుందరీకరించారు. “స్వచ్ఛ సుందర చల్లపల్లి” సైనేజ్ బోర్డును ఏర్పరిచారు.
డా. పద్మావతి గారి చిరకాల స్వప్నమూ, సుందరీకరణ తపస్సూ, ఆమె కష్టార్జిత ధన త్యాగమూ, కార్యకర్తల కఠోర శ్రమా, ఇతర శ్రామికుల కృషీ, ఇప్పటికి ఫలించి గ్రామ- శ్మశాన ముఖద్వారమైన ఈ “తరిగోపుల ప్రాంగణము” ఇంత శోభాయమానంగా చల్లపల్లి ప్రజల ఆహ్లాదానికి, సిద్ధమైనది.
ఇంకా ఈ బృహత్కార్యములో సహకరించిన -
“ఎందరో మహానుభావులు
అందరికీ వందనములు!”
- డా. డి.ఆర్.కె.ప్రసాదు
15.08.2026